5 ఏళ్లుగా అద్దె పెంచలేదు: కిరాయిదారు మనసు గెలుచుకున్న బెంగళూరు ఇంటి ఓనర్

  • 2018 నుంచి అద్దెకు ఉంటున్నట్లు రెడ్డిట్‌లో పేర్కొన్న కిరాయిదారు
  • ఐదేళ్ల క్రితం ఎంత అద్దె ఇచ్చానో... ఇప్పుడూ అంతే ఇస్తున్నట్లు వెల్లడి
  • ఇలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఉండాలని వ్యాఖ్య
బెంగళూరులో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి రెడ్డిట్‌లో తన యజమాని మంచితనం గురించి రాసిన ఓ సమీక్ష నెట్టింట వైరల్‌గా మారింది. కర్ణాటక రాజధానిలో ఇల్లు అద్దెకు దొరకాలంటే చాలా కష్టం. ముందుగా అడ్వాన్స్ చెల్లించడంతో పాటు అద్దె కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. అయితే తన యజమాని తనను 5 ఏళ్ళుగా అద్దె పెంచమని అడగలేదని సదరు అద్దెదారు పేర్కొన్నారు.

తాను అద్దెకు ఉంటున్న భవన యజమాని వయస్సు 65 సంవత్సరాలకు పైగా ఉంటుందని, ఇక్కడే తాను ఐదేళ్లుగా ఉంటున్నానని సదరు అద్దెదారు పేర్కొన్నారు. ఈరోజు తనకు డిన్నర్ తీసుకు వచ్చాడని, తనపట్ల ఎవరూ ఇంత అభిమానం చూపించలేదన్నారు. తన ఇంటి యజమాని వృద్ధుడని, అందరితోనూ కలివిడిగా ఉంటాడని పేర్కొన్నారు. తాను 2018 నుంచి ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు అద్దెను పెంచలేదన్నారు.

తాను ఐదేళ్ల క్రితం ఇందులో దిగినప్పుడు ఎంతైతే అద్దె చెల్లించానో... ఈ రోజుకూ అంతేమొత్తం చెల్లిస్తున్నానన్నారు. అతను మాట్లాడినప్పుడు తన జీవిత కథను చెబుతుంటారని, అలాగే ఆయన కుమార్తెల విజయగాథలను కూడా వింటుంటానని అద్దెదారు వెల్లడించారు. తనకు తరచూ బ్రాందీ కూడా ఆఫర్ చేస్తుంటారని, కానీ తాను దానిని తాగలేదన్నారు. ఇలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని సదరు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు.

Bengaluru
Karnataka
Rent

More Telugu News